ఆంధ్ర ప్రదేశ్ : మాజీ ముఖ్యమంత్రులు వైఎస్,
చంద్రబాబుల స్నేహం, రాజకీయ వైరాన్ని బేస్ చేసుకుని ఓ సిరీస్ రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వచ్చింది. తాజాగా దీనిపై దర్శకుడు దేవా కట్టా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై 2017లోనే ఓ ఫిక్షనల్ స్టోరీ రాసి, రిజిస్టర్ కూడా చేయించాను. అయితే నా కాన్సెప్ట్ను వేరే వాళ్లు తస్కరించారు. చట్టపరంగా వాళ్లు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. మొదట అది ఎవరు చేసిందో చెప్పనప్పటికీ తరువాత ఆ పని చేసింది నిర్మాత విష్ణు ఇందూరి అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
‘గాడ్ ఫాదర్’ సినిమా స్ఫూర్తితో వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుగార్ల స్నేహం, రాజకీయ వైరంపై మూడు భాగాలుగా స్క్రిప్ట్ రెడీ చేశాను. ఆ తర్వాత దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్లోకి మార్పు చేసి, నా ఐడియాను పలు ఓటీటీ ప్లాట్ఫామ్లకు వివరించాను. 2015 డిసెంబర్లో ఎన్టీఆర్ బయోపిక్ గురించి చర్చించడానికి విష్ణు ఇందూరి, నేను కలిశాం అని దేవా ట్వీట్ చేశారు. గతంలో నా స్క్రిప్ట్ తస్కరించిన ఓ వ్యక్తి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. కానీ ఈసారి అలా కానివ్వను అన్నారు దేవా కట్టా.