ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖయమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దీని వల్ల కచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలన్నారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్ చేర్చినట్లు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్షిప్ను చేర్చినట్లు పేర్కొన్నారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్షిప్ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్ క్రెడిట్స్ సాధించేవారికి కూడా ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామని వెల్లడించారు.
పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నాడు – నేడు పనులతో అత్యుత్తమ ప్రమాణాలను తీసుకు రావాలని సూచించారు. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు , ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
పాడేరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన సీఎం ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని,సెప్టెంబరులో సెట్ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలి’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.
మరిన్ని వార్తలు చదవండి : సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్