ఆంధ్రప్రదేశ్ :కమీషన్లకు కక్కుర్తిపడి టీడీపీ పోలవరం కట్టిందన్నవారు. ఇప్పుడు ఏం కక్కుర్తికోసం ప్రాజెక్ట్ కడతామంటున్నారని మాజీ మంత్రి
దేవినేని ఉమ నిలదీశారు. రూ.500 కోట్ల ఇసుక స్కాం బయటకు రాకూడదని, పోలవరం ప్రాజెక్ట్కి ఇంజనీర్ ఇన్ చీఫ్ లేకుండా చేశారని తప్పుబట్టారు. హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేలు చేయడం మానేసి, డ్యాముల్లో ఎంత నీటిమట్టం ఉందో తెలుసుకోవాలని హితవుపలికారు. కమీషన్ల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
సీఎం జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లోని వారికి రూ.10 లక్షలిస్తామని, 2013 భూసేకరణ చట్టం అమలుచేస్తామన్నారని విమర్శించారు. 7 మండలాల్లో ఏం జరుగుతుందో బయటికి తెలియనివ్వడం లేదని, నిర్వాసితులను ముందే ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు? అని ప్రశ్నించారు.
విశాఖను టీడీపీ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దితే, నేడు అడ్డపంచల అడ్డాగా మార్చారు, తెచ్చిన పెట్టుబడులు పోగొట్టారు, అరాచకం తెచ్చిపెట్టారు. భూకబ్జాలు, దౌర్జన్యాలు చూసి నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వాసుల భయమే నిజమైందన్న చంద్రబాబు మాటలకు ప్రజలకు సమాధానం చెప్పండి అని దేవినేని ఉమ ట్వీట్ చేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.