ఆంధ్రప్రదేశ్ : స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మృతి చెందిన కేసులో నిందితుడు, రమేష్ ఆసుపత్రి యజమాని
రమేష్బాబు పరారవడంతో ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఫైర్, విద్యుత్, వైద్య, భద్రతా సిబ్బంధి నివేదికలను కమిటీల సభ్యులు సిద్ధం చేశారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు కమిటీల విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే వారు అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వలేదని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
మంటలు చెలరేగిన తర్వాత ఫైర్కి సమాచారం ఇచ్చినందువల్లే ప్రమాదస్థాయి పెరిగిందని తెలిసింది. అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే ప్రాణనష్టం జరిగినట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని కమిటీ సభ్యులు నిర్దారించారు. దీంతోపాటు కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు, అనుమతికి మించి రోగులను చేర్చుకున్నట్టు వారి కమిటీ సభ్యులు గుర్తించినట్టు తెలిసింది.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు. ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్లకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
మరిన్ని వార్తలు చదవండి.