ఆంధ్రప్రదేశ్ :మాజీ ఎమ్మెల్యే
యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేయరపతినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉండగా పెద్దఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడటంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
కోర్టు జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాడు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణాతోపాటు దాచేపల్లి మండలం నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్లోను, కేసానుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి.
గత ఏడాది డిసెంబర్ 24న యరపతినేనిపై కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగాఈ కేసులో కీలక డాక్యుమెంట్లను సీఐడీ నుంచి సీబీఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఈ కేసు కీలక మలుపు తిరగనుందని త్వరలోనే దీనిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి.